Dhanush: ‘రాంఝనా’ ఏఐతో క్లైమాక్స్ మార్పుపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ధనుష్!
Dhanush: ప్రముఖ నటుడు ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్.. తమ బ్లాక్బస్టర్ చిత్రం ‘రాంఝనా’ క్లైమాక్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ను ఇటీవల రీ-రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్, విషాదకరమైన ముగింపును సంతోషకరంగా మార్చింది. దీనిపై దర్శకుడు, హీరో తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.
దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ మాట్లాడుతూ, ఈ మార్పులు చాలా ప్రమాదకరమని, భవిష్యత్తులో ఇతర చిత్రాలకు కూడా ఇది చెడు ఉదాహరణగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమ సృజనాత్మకతను దెబ్బతీయడమేనని, చిత్రానికి గల ఆత్మను చంపేయడమేనని ఆయన అన్నారు. గత 12 సంవత్సరాలుగా ఈ సినిమాను అభిమానులు ఎలా ప్రేమించారో, ఆ నమ్మకాన్ని ఉల్లంఘించడమేనని ఆనంద్ ఆవేదన చెందారు. తాను మాత్రమే కాకుండా, ధనుష్ కూడా ఈ మార్పు పట్ల తీవ్ర బాధలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
విడుదలకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు..!
మరోవైపు, ఈ వివాదంపై స్పందించిన ఎరోస్ ఇంటర్నేషనల్, ఈ మార్పు గురించి తమ ప్రతినిధి ధనుష్ బృందంతో నేరుగా మాట్లాడారని, అయితే విడుదలకు ముందు వారు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని పేర్కొంది. ఈ విషయంలో దర్శకుడు, నటుడు ఇద్దరూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నటీనటుల అనుమతి లేకుండా వారి నటనను, భావోద్వేగాలను ఏఐ ద్వారా మార్చడం నైతిక, చట్టపరమైన సమస్యలను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం సినీ ప్రపంచంలో ఏఐ వినియోగంపై ఒక ముఖ్యమైన చర్చకు తెరలేపింది.
ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ‘రాంఝనా’ 2013లో విడుదలై, విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఇరోస్ ఇంటర్నేషనల్ తమిళ్ వెర్షన్ను ఈనెల 1న రీ రిలీజ్ చేసింది. విచారకరమైన ఎండింగ్ను ఏఐ సాయంతో హ్యాపీ ఎండింగ్గా మార్చి రిలీజ్ చేశారు. దీనిపై దర్శకుడు ఆనంద్, ధనుష్ ఆవేదన వ్యక్తంచేస్తూ దీన్ని ఖండించారు.
