Varahi Yatra in Visakha : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో మొదలై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ విధితమే. ఈ వారాహి విజయ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలాన్ని ఆ రెండు జిల్లాల్లో చూపించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, జనసేన అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో వాటితోపాటు,
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేయాలని వారాహి విజయయాత్ర సంకల్పాన్ని చేశారు జనసేన అధినేత. ఆయన ఊహించిన దానికంటే వారాహి యాత్ర ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రజలు ఎన్ని సమస్యల్లో ఉన్నారో కూడా బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి విజయయాత్రను మొదలుపెట్టనున్నారు. అది ఎక్కడి నుండి అంటే..
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ..
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలి. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు అన్నారు.