69th National Film Awards : 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటిన విషయం మనకు తెలిసిందే.. ఊహించని విధంగా తెలుగు సినిమాలకు అవార్డుల వర్షం కురిసింది. ఈ సందర్భంగా అవార్డులు గెలుచుకున్నటూ వంటి ప్రముఖులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లులు కురిపించారు. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ సినిమా రూపకల్పనలో నిమగ్న మయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయి. పుష్ప చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్., ఈ సినిమాకుగాను విజేతలుగా నిలిచిన కీరవాణి, కాలభైరవ, శ్రీనివాస మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలోమన్ ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుకి అభినందనలు. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం సంతోషకరం. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి, దర్శకుడు సానా బుచ్చిబాబుకి అభినందనలు.
పలు విభాగాల్లో అవార్డులు కైవశం చేసుకోవడంతోపాటు బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ని నిలిపిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత డి.వి.వి.దానయ్యలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. శాస్త్రవేత్త శ్రీ నంబి నారాయణ్ జీవితాన్ని చూపిన ‘రాకెట్రీ’ చిత్రాన్ని ఉత్తమంగా నిలిపిన దర్శకులు, నటులు ఆర్.మాధవన్ అభినందనీయులు. ఉత్తమ నటీమణులుగా నిలిచిన శ్రీమతి అలియా భట్ (గంగూభాయ్), కృతి సనన్ (మిమి) ప్రశంసలకు అర్హులు.
‘ద కశ్మీర్ ఫైల్స్ ‘ ముఖ్యమైన అవార్డులు దక్కించుకొంది. ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అభినందనలు. ఉత్తమ దర్శకుడిగా నిలిచిన మరాఠీ దర్శకుడు నిఖిల్ మహాజన్ (గోదావరి)కీ, ఉత్తమ గాయని శ్రీమతి శ్రేయ ఘోషల్. ఉత్తమ ఛాయాగ్రహకుడు అప్టిక్ ముఖోపాధ్యాయ్, హిందీ చిత్ర సీమ నుంచి అవార్డులకు ఎంపికైన సంజయ్ లీలా భన్సాలీ, శ్రీమతి పల్లవి జోషి, పంకజ్ త్రిపారీలకు అభినందనలు. వివిధ భాషల ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల నుంచి ఈ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.