రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఇంకోపక్క సినిమాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు మరో తీపి కబురు అందించబోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చి థియేటర్లు ప్రారంభం అయిన వెంటనే వకీల్ సాబ్ విడుదల చేసేందుకు నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. సైరా నరసింహారెడ్డి తో చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అత్యద్భుతంగా ప్రజెంట్ చేసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి కథలు అందించి నా పేరు సూర్య చిత్రంతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ మరోసారి తన కలానికి పదును పెట్టి పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా కథ సిద్ధం చేసారట. అందులో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
పవన్ పుట్టిన రోజు కానుకగా ఈ విషయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతగా గతంలో రవితేజ తో నేల టికెట్, డిస్కో రాజా చిత్రాలను తెరకెక్కించిన రామ్ తాళ్ళూరి వ్యవహరించనున్నారు. ఈయన పవన్ కి ముందు నుండి సన్నిహితుడు, ఆ అనుబంధంతోనే ఆయన నిర్మించిన నేల టికెట్ ఆడియో పవన్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఇప్పుడు అదే కారణంతో ఎస్ ఆర్ టి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రంలో నటించనున్నారని సమాచారం.
Discussion about this post