Saiyaara: నా సగం జీవితం సెట్లోనే.. ‘సైయారా’ డైరెక్టర్ మోహిత్ సూరి భావోద్వేగం..
Saiyaara: తక్కువ అంచనాలతో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది ‘సైయారా’ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో, దర్శకుడు మోహిత్ సూరి ఆనందంలో మునిగి తేలుతున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు, తన బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే, తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆయన పంచుకున్న కొన్ని విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహిత్ సూరి మాట్లాడుతూ, “నాకు సినిమా సెట్ మాత్రమే అసలైన ప్రపంచం. బయట సామాజిక కార్యక్రమాలకు వెళ్లినప్పుడు నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతాను. అక్కడ నేను ‘మోహిత్ సూరి’ అనే పాత్రను పోషిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ సెట్లో నేను నాలా ఉండగలను,” అని తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఆయన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, “నా 17వ ఏట అసిస్టెంట్ డైరెక్టర్గా నా ప్రస్థానం మొదలైంది. ఐదేళ్ల తర్వాత, 22 ఏళ్లకే దర్శకుడిగా మారాను. ఇప్పుడు నా వయసు 44 ఏళ్లు. అంటే నా జీవితంలో సరిగ్గా సగం, 22 సంవత్సరాలు, సినిమా సెట్స్లోనే గడిచిపోయింది. ఆ వాతావరణంలోనే నాకు నిజమైన స్నేహితులు దొరుకుతారు. నా జీవితాంతం ఇలా సెట్స్లోనే గడిచిపోవాలని కోరుకుంటున్నాను,” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘సైయారా’ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్ యూట్యూబ్లో ఏకంగా 200 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించడం విశేషం. మోహిత్ సూరి అంకితభావం, సినిమాపై ఆయనకున్న ప్రేమే ఇలాంటి అద్భుత విజయాలకు కారణమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
అంచనాలకు మించి విజయం..
యాక్షన్ చిత్రాల వైపు బాలీవుడ్ మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో, ‘సైయారా’ వంటి ఒక స్వచ్ఛమైన రొమాంటిక్ చిత్రం అద్భుతమైన విజయం సాధించడం ప్రశంసనీయం. ‘కంటెంటే కింగ్’ అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కేవలం ఉత్తరాదిలోనే కాకుండా, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసించారు.
