Disha Patani: దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు.. బరేలీలో ఉద్రిక్తత, గోల్డీ బ్రార్ గ్యాంగ్ హస్తం?
Disha Patani: బాలీవుడ్ స్టార్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, ఈ ఘటన వెనుక గోల్డీ బ్రార్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ఈ కాల్పుల బాధ్యతను తామే తీసుకున్నామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఖుష్బూ పటానీ, ఒక మాజీ ఆర్మీ అధికారిణి. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పటానీ ఇంటిని టార్గెట్ చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
దిశా పటానీ సినిమాల విషయానికి వస్తే, ఆమె 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్లో ‘ఎంఎస్ ధోనీ – ది అన్టోల్డ్ స్టోరీ’, ‘భాగీ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. ఆమె చైనీస్ ప్రాజెక్ట్ ‘కుంఫు యోగా’లో కూడా నటించారు.
తొమ్మిదేళ్ల విరామం తర్వాత, ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమాతో టాలీవుడ్లో మళ్లీ కనిపించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం ‘వెల్కమ్ టు జంగిల్’తో పాటు ఇంగ్లీష్ ప్రాజెక్ట్ ‘హోలీ గార్డ్స్ సాగా’లో నటిస్తున్నారు. దిశా పటానీ ఇంటి ముందు జరిగిన ఈ కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
