Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదుతో చర్యలు
Ram Gopal Varma: సంచలన దర్శకుడు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నిర్మించిన ‘దహనం’ వెబ్ సిరీస్ విషయంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘దహనం’ (Dahanam) వెబ్ సిరీస్ ఫ్యూడలిస్టులు, మావోయిస్టుల మధ్య పోరాటాన్ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కింది. ఓ కమ్యూనిస్టు నాయకుడి హత్య, దాని తర్వాత అతని కొడుకు తీర్చుకునే ప్రతీకారం కథాంశంగా ఈ సిరీస్ రూపొందింది. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ విడుదల సమయంలో, ఇది ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా తీసినట్లు ఆర్జీవీ వెల్లడించారు.
అయితే, ఈ విషయంపై అంజనా సిన్హా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తాను ఎవరితోనూ ఇలాంటి విషయాలు పంచుకోలేదని ఆమె స్పష్టం చేశారు. అనుమతి లేకుండా తన పేరును, గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పరిటాల శ్రీరాములు కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ తొలి ఎపిసోడ్ సాగుతుంది. తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా హరి నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాడో ఇందులో చెప్పారు. ఈ గొడవలకు దూరంగా తాను ప్రాణంగా ప్రేమించిన సునీతతో కలిసి రవి కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు కన్న కలలను ఆవిష్కరించారు. శ్రీరాములు హత్య తర్వాతే అసలు కథ మొదలవుతుంది.
తండ్రి మరణానికి కారణమైన వారిని అంతమొందించేందుకు హరి తన అనుచరులైన సురేష్, చమన్లతో కలిసి చేసిన ప్రయత్నాలు, చెన్నారెడ్డితో పాటు అతడి తనయుడు ఓబుల్రెడ్డి ఉరవకొండ ప్రాంతంలో చేసే అన్యాయాలు, అక్రమాలతో మిగిలిన ఎపిసోడ్స్ సాగుతాయి. ఈ ఆధిపత్య పోరులో గెలుపు ఎవరిదనే అంశాన్ని ప్రజెంట్, ఫ్లాష్బ్యాక్ లతో డిఫరెంట్ స్క్రీన్ప్లే టెక్నిక్ ద్వారా చెబుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు దర్శకుడు అగస్త్య మంజు ప్రయత్నించారు.
