Chiranjeevi Deepfake: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్..
Chiranjeevi Deepfake: సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘డీప్ఫేక్’ టెక్నాలజీ ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి భద్రతకు పెనుసవాలుగా మారింది. తాజాగా ఈ డీప్ఫేక్ బారిన మెగాస్టార్ చిరంజీవి పడటం సినీ పరిశ్రమలో, అభిమానులలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
కొంతమంది దుండగులు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను అడ్డంగా మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీల వీడియోలుగా మార్చి వివిధ సోషల్ మీడియా వేదికలు, వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఈ నకిలీ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ కావడంతో, చిరంజీవి ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం జరిగింది.
ఈ విషయం తెలియగానే చిరంజీవి వెంటనే స్పందించి, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్కు ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతేకాక న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రకమైన సాంకేతిక దుర్వినియోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “డీప్ఫేక్ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం చాలా ఘోరమైన విషయం. నా పేరుతో అశ్లీల వీడియోలు సృష్టించి పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని చిరంజీవి పోలీసులను కోరారు.
దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, అగ్ర నటీనటులు డీప్ఫేక్ వీడియోల బారిన పడుతున్న సందర్భాలు ఇటీవల పెరిగాయి. దీనిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ (AI) టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)తో #ChiruBobby2 లేదా ‘మెగా 158’ పేరుతో మరొక సినిమాను అధికారికంగా ప్రకటించారు.
