గాజువాకలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన పదిహేడేళ్ళ బాలికపై ప్రేమోన్మాది దాడిచేసి హత్య చేసిన ఘటన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
ఆ విద్యార్థిని కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో వివిధ అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆడబిడ్డ తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
కొద్ది రోజుల కిందటే విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్య చేసిన దుర్మార్గాన్ని ఎవరూ మరచిపోలేదని, ఇప్పుడు గాజువాకలోనూ అదే తరహా ఉన్మాదపు హత్య చోటు చేసుకోవడం దారుణమని అన్నారు.
ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదన్నారు.. దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఏం సమాధానం చెబుతారన్నారు.
చట్టాలు చేసేశామని చేతులు దులుపుకొంటే ఫలితం రాదని, ఆ చట్టం ఇప్పటికీ అమలులోకి రాకపోవడానికి కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని, ఆర్భాటపు ప్రచారాలతో ఫలితం రాదని గ్రహించాలని, పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలు తప్పనిసరి చేయాలి. అదే విధంగా యువతులకు, మహిళలకు ఆత్మ రక్షణ మెళకువలు తెలపాలి. విద్య, స్త్రీ శిశు సంక్షేమ, హోమ శాఖలు సంయుక్తంగా ఇందుకు సంబంధించి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
