ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారనే దానిపై రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవు. సిబ్బంది అందుబాటులో లేరు. ఔషధాలు ఉండవు అని ఆయన అన్నారు.
కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్ గారిని వేధించారు. ఆయన మానసిక వ్యధకి లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో… కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉంది అని ఆయన తెలిపారు.
పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదనీ పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా అని సూచించారు.
ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టమని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసా?
బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త, మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుని కనీసం ఒక్క సంస్థకైనా పెట్టమని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.
ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు – ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలి అని ఆయన సూచించారు.
