అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయంలో రథం దగ్ధమైన తర్వాత నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలను అరెస్టు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై వివక్ష చూపిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై చలో అమలాపురం కి పిలుపునిచ్చిన ఆయనను విజయవాడలో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,అంతర్వేది అరెస్టులు విషయంలో ప్రభుత్వ వైఖరిని పునఃసమీక్షించుకోవాలి తమ మతవిస్వాసం, మనోభావాలు దెబ్బతిని నిరసన చేస్తున్న హిందూ సోదరులను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, విగ్రహాల ధ్వంసం ఘటనను మాత్రం పిచ్చివాడికి ఆపాదించి చేతులు దులుపుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు.
చర్చ్ మీద ఘటనకు ఫైర్ అయ్యిన రీతిలో రథం ఫైర్ అయ్యిన విషయంలో దోషులను గుర్తించే ఫైర్ ప్రభుత్వం దగ్గర లేదా? చర్చ్ లకు ఉన్న ప్రాధాన్యత హిందూ దేవాలయాల విషయంలో లేదా? ఇప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేశారు. కానీ.. ఇటువంటి అరెస్టులకు భయపడే తత్వం భాజపా శ్రేణులలో లేదు, చైనాను ఢీకొడుతున్న అగ్రనాయకత్వ స్ఫూర్తి మాలో కూడా ఉంది. ఆ పోరాటస్ఫూర్తితో ముందుకెళ్తాము. ఇలాంటి అరెస్టులకు జడిసే ప్రసక్తే లేదు. మా స్థాయిని అంచనా వెయ్యడంలో గత ప్రభుత్వం అనేక విమర్శలు చేసింది. నేడు ఫలితాన్ని అనుభవిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పునఃసమీక్షించుకోవాలి. మా పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. మత రాజకీయం చేసే లక్షణం భారతీయ జనతా పార్టీది కాదు.
దేవాలయాల్లో అన్యమతస్థుల ప్రమేయం కారణంగా దైవ దర్శనాన్ని కూడా వాళ్ళు శాశించే పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు.
మా వ్యక్తిత్వాలను, భావజాలాన్ని ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి. గృహానిర్బంధాల ద్వారా మమ్మల్ని నిలువరించే ప్రయత్నం మానుకోవాలి. వివక్షతో కూడిన ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినే అంశంలో ధీటుగా బదులివ్వడానికి , సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది. అనే విషయం గుర్తుంచుకోవాలి అంటూ ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.