Aamir Khan: యూట్యూబ్లో ‘సితారే జమీన్ పర్’.. రేట్ ఎక్కువ ఉందంటూ ఫిర్యాదులు..!
Aamir Khan: బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) విషయంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదల చేయకుండా, నేరుగా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా పే-పర్-వ్యూ మోడల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి వీక్షకులు రూ.100 అద్దె చెల్లించి సినిమాను చూడవచ్చని ఆమిర్ టీమ్ ప్రకటించింది. అయితే, కొన్ని డివైజ్లలో అద్దె రూ.179గా కనిపించడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఆమిర్ టీమ్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పింది.
“కొన్ని డివైజ్లలో అద్దె ఎక్కువ చూపిస్తోందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అందరినీ క్షమాపణలు కోరుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు అందరం కృషి చేస్తున్నాం. వీలైనంత త్వరలో దీన్ని పరిష్కరిస్తాం. అర్థం చేసుకొని సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు” అని ఆమిర్ టీమ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఆమిర్ ప్రత్యేక అడుగు..
ఆమిర్ ఖాన్ ఎప్పటినుంచో ఓటీటీలకు వ్యతిరేకిగా ఉన్న విషయం తెలిసిందే. థియేటర్లకు వచ్చి సినిమా చూసే సంస్కృతిని ప్రోత్సహించాలనేది ఆయన ఉద్దేశం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ఎక్కువ మందికి చేరువ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో సినిమా హాళ్ల సంఖ్య తగ్గుతుండటం, థియేట్రికల్ రిలీజ్లు, ఓటీటీల మధ్య వ్యవధి తగ్గిపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారని ఆమిర్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా యూట్యూబ్ను ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు.
యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోని మాట్లాడుతూ, భారతీయ సినిమాకు యూట్యూబ్తో ఉన్న సంబంధం కొత్తేమీ కాదని అన్నారు. టీజర్లు, ట్రైలర్లు, మ్యూజిక్ వీడియోలు వంటివి యూట్యూబ్లో విడుదల చేయడం సాధారణమే అని ఆమె పేర్కొన్నారు. “సితారే జమీన్ పర్” యూట్యూబ్లో విడుదల కావడం భారతీయ సినిమా పంపిణీలో ఒక కీలకమైన ముందడుగు అని సోని అభిప్రాయపడ్డారు.
