Akkineni Nagarjuna: నాగార్జునపై అభ్యంతరకర కంటెంట్ తొలగించాలి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట కల్పించింది. తన పేరు, ఫోటోలు, వాయిస్తో పాటు ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో అనధికారికంగా వాడుతున్నారంటూ ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ చర్య తన వ్యక్తిగత గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, నాగార్జున వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, నాగార్జున వ్యక్తిత్వ లక్షణాలను ఎటువంటి అనుమతి లేకుండా ఉపయోగించడాన్ని, ముఖ్యంగా అభ్యంతరకరమైన లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్లో చూపించడాన్ని నిషేధించింది. పిటిషన్లో పేర్కొన్న వెబ్సైట్లు, ఆన్లైన్ లింక్లను 72 గంటల్లోగా తొలగించాలని యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, ఇతర డిజిటల్ సర్వీసులన్నింటికీ కోర్టు కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు AI సాంకేతికత దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలకు ఒక స్పష్టమైన హెచ్చరికగా మారింది.
ఈ తీర్పుపై స్పందించిన నాగార్జున, సోషల్ మీడియా ద్వారా ఢిల్లీ హైకోర్టుకు, తన న్యాయవాదుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి పర్సనాలిటీ హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. ఇప్పుడు నాగార్జునకు వచ్చిన ఈ తీర్పు దక్షిణాది సినీ తారలకు కూడా ఒక కొత్త న్యాయ మార్గాన్ని చూపుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
కాగా.. కొన్నిరోజుల క్రితం నేషనల్ క్రష్ రష్మిక ఏఐ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరో యువతికి సంబంధించిన వీడియోలో రష్మిక మందన్నా ముఖంతో మార్చి చేసిన వీడియో అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ అశ్లీల వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏఐ సాంకేతికత వాడకానికి పరిమితులు ఉండాలని అప్పట్లో పెద్దఎత్తున డిమాండ్లు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
