తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం చోటుచేసుకోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు తల్లడిల్లిపోతున్న ప్రజలకు వాయుగుండం రూపంలో ప్రకృతి తీరని శోకాన్ని మిగిల్చిందని, తెలంగాణలో 13 మంది, ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు జలవిలయం కారణంగా ప్రాణాలు కోల్పోవడం, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందడం చాలా విషాదకరం అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ఈ ప్రకృతి విపత్తు తీవ్రంగా దెబ్బతీసింది. వరి మొక్కజొన్న పత్తి మిరప వంటి పంటలతో పాటు ఉద్యానవన పంటలను సైతం ఈ వర్షాలు విడిచిపెట్టలేదు. లక్షన్నర ఎకరాల లోనే పంట నాశనమై రైతులకు సుమారు 400 కోట్ల నష్టం వాటిల్లడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని ఆయన అన్నారు. కృష్ణ, గోదావరి నదుల తో పాటు రెండు రాష్ట్రాల్లో ఏరులు, వాగులు, వంకలు, చివరకు చెరువులు సైతం ఉగ్రరూపంతో ప్రజలను ముంచెత్తుతున్నాయి. ఈ వందేళ్లలో ఇంతటి భారీ వర్షాలు కురవ లేదని రికార్డులు వెల్లడిస్తుంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆపన్నులకు అన్నివిధాలుగా అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఉన్నచోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రైతులకు ఉదారంగా నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.
“మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఆపత్కాలంలో జనసైనికులు తమవంతు చేయూత అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. నాలాలు కూడా ప్రమాదకరంగా మారాయి ప్రజలందరూ బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
