Bairi Indira : తన చావుపై ముందే కవిత రాసిన తెలంగాణా తొలి గజల్ కవయిత్రి కన్నుమూత… కవిత వింటే కన్నీళ్లు ఆగవు..!!
ప్రముఖ తెలంగాణా తొలి గజల్ కవయిత్రి గా పేరు పొందిన భైరి ఇందిర కన్నుమూశారు. ఆమె స్వస్థలం భధ్రాద్రి జిల్లా కొత్తగూడెం.. ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్ కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు.గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కూకట్పల్లిలోని తన స్వగృహంలో ఆమె ఆదివారం నాడు కన్నుమూశారు. ఆమె మృతితో సాహితీలోకం విషాదంలో మునిగిపోయింది..
అయితే వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు కూడా అయిన ఇందిర గతంలో తన చావుపై ఒక కవిత రాసుకున్నారు.
తన చావుపై రాసిన కవిత చూస్తే ప్రతీ ఒక్కరి మనసు కలచివేయమానదు..
తన చావు గురించి తాను రాసుకున్న కవిత..
నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది.
మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను.
దండలు గిండలు వెయ్యకండి
నాకు పరమ ఎలర్జీ.
పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు..పైగా నన్ను గుర్తుపట్టాలి కదా
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది.
నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి.
మంగళవారమైనాసరే..
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి
కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో
బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు.
దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది.
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి
పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది
తను రాసిన ఈ కవిత చూసి కన్నీరు బొట్టు కార్చని మనుషులు ఉన్నారా…??
ఓం శాంతి..!!