Deepika Padukone: దర్శకురాలిని అన్ఫాలో చేసిన దీపికా పదుకొణె.. వివాదం ఏంటంటే?
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్లు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారంటూ గత కొన్ని రోజులుగా వచ్చిన వార్తలపై ఫరా ఖాన్ స్వయంగా స్పందించారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం చెడిందని వచ్చిన పుకార్లకు ఆమె తన వివరణతో ముగింపు పలికారు.
అసలేం జరిగింది?
ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఫరా ఖాన్.. దీపికా పదుకొణె పనివేళలపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. “దీపికా ఇప్పుడు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తోంది. ఇలాంటప్పుడు ఆమె ఈ షోకు ఎలా వస్తుంది? అంత సమయం ఆమెకు ఎక్కడ ఉంటుంది?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యల కారణంగా దీపికా పదుకొణె మనస్తాపం చెందారని, అందుకే ఆమె ఫరా ఖాన్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారని వార్తలు వచ్చాయి.
ఈ పుకార్లపై ఫరా ఖాన్ స్పందిస్తూ.. “మేమిద్దరం మొదటి నుంచి ఒకరినొకరం ఫాలో చేసుకోవడం లేదు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరం నేరుగా మాట్లాడుకోవాలని, సోషల్ మీడియాలో కాదు అని ఒక ఒప్పందం చేసుకున్నాం. అందుకే మేము ఒకరి పుట్టినరోజులకు కూడా పోస్టులు పెట్టం. ఎందుకంటే దీపికకు అలాంటివి నచ్చవు” అని ఆమె స్పష్టం చేశారు. వారి మధ్య స్నేహం గతంలో మాదిరిగానే ఉందని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు.
ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాల్లో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. అప్పటినుంచి వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈ వివరణతో వారి మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లకు తెరపడింది.
కాగా.. గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణె చుట్టూ వివాదాలు అలుముకుంటున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కల్కి సీక్వెల్ నుంచి దీపికా అర్థాంతరంగా వైదొలిగింది. దానికి కూడా పని వేళలే ప్రధాన కారణంగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి కూడా దీపికా వైదొలిగింది. ఆ సమయంలో సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొణె మధ్య కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో వార్ నడిచిన విషయం తెలిసిందే.
