తెలుగు వారి భోజనంలో నెయ్యి లేకపోతే అది అసంపూర్ణమైన భోజనమే. మనం ఉదయం అల్పాహారంలో ఇడ్లీల దగ్గరి నుంచి మధ్యాహ్నం ముద్దపప్పులో, సాయంత్రం అల్పాహారాల్లో ప్రతిపూట నెయ్యిని తినేందుకు ఇష్టపడతాం. అంతేకాదు నెయ్యి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ శీతాకాలంలో నెయ్యిని ప్రతిరోజూ ఆహారంలో కలుపుకొని తినమని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఈ చల్లటి వాతావరణంలో నెయ్యి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో తెలుసుకుందాం.
వెచ్చదనం: శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణాలు నెయ్యిలో ఉన్నాయి. నెయ్యి తటస్థ రుచిని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని ఏ వంటకంలో వేసినా, ఆ వంటకం నాణ్యత, రుచి పెరుగుతుంది. అందుకే నెయ్యిని అన్నంలో, రోటీలలో, పప్పులో, పాయసంలో ఎందులోనైనా కలుపుకొని తినవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నెయ్యిలోని పోషకాలలో గ్యాస్ట్రిక్ రసాలు కూడా ఉంటాయి. సాధారణంగా గ్యాస్ట్రిక్ రసాల్లో ఆహారాన్ని సరళంగా మార్చే ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ఆహారాన్ని మృదువుగా మార్చి, ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అందుకే భోజనంలో ఒక టీస్పూన్ నెయ్యి కలుపుకోవాలని సూచిస్తున్నారు.
జలుబు, దగ్గుకు ఔషధం: నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇది దగ్గు, జలుబు వంటి సీజనల్ అనారోగ్యాలకు చికిత్స చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి రెండు చుక్కలు నాసిక రంధ్రాలలో వేస్తే జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
చర్మానికి లోపలి నుండి తేమ: నెయ్యి ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. దీనిని చర్మానికి బాహ్యవైపు నుంచి అప్లై చేసినప్పటికీ, లోపలి నుంచి కూడా తేమగా ఉంచుతుంది. నెయ్యితో మీ చర్మం మృదువుగా, కోమలంగా మార్చుకోవచ్చు.
