ఆదాయానికి మించి ఆస్థుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కొద్దిగా ఉపశమనం లభించింది. ఆస్థుల కేసును ప్రతి శుక్రవారం రోజున సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేస్తుంది. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున వైఎస్ జగన్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే లాయర్లు పలుమార్లు కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించిన కోర్టు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోర్టు హాలులో ఎక్కువ మంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఒకపక్క ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వరమే విచారణలు మొదలుపెట్టాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా హైకోర్టు కూడా ప్రజాప్రతినిధులకి సంబందించిన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఈ కేసును ఈనెల 12కి వాయిదా వేసింది.