బంగ్లాపై సిరీస్ కోల్పోయామన్న బాధతోనో, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వెల్లువెత్తిన విమర్శలో నామమాత్రమైన ఆఖరి వన్డేలో టీమిండియా రెచ్చిపోయింది. చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత ఆటగాళ్లు బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఫోర్లు, సిక్స్లతో చెలరేగారు. ముందుగా ఇషాన్ కిషన్ (210) డబుల్ సెంచరీతో విరవిహారం చేయగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ (113) కూడా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.
యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. కెరీర్లో సాధించిన తొలి సెంచరీనే డబుల్గా మలిచాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్తో ఇషాన్ అరుదైన ఘనతలను అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో మూడో వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు టీమిండియా బౌలర్ల దాటికి 182 పరుగులకే కుప్పకూలింది.

షకీబ్ అల్ హసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లిటన్ దాస్ 29, యాసిర్ అలీ 25, మహ్మదుల్లా 20 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్, సుందర్, సిరాజ్లు తలా ఒక వికెట్ తీశారు. 2007 వన్డే ప్రపంచకప్లో బెర్ముడాపై భారత్ 418 పరుగులు చేసింది. కొద్దిలో ఆ రికార్డు మిస్ అయింది.
ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, ఇబాదత్ హొసెన్, తస్కిన్ అహ్మద్లు తలా రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్, మెహదీ హసన్లు చెరొక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికి టీమిండియా సిరీస్ను కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన టీమిండియా ఆధిక్యాన్ని 2-1కి మాత్రమే తగ్గించగలిగింది. ఇక ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 14 నుంచి మొదలుకానుంది.