Kitchen Tips : వంటింట్లో సమయానికి అన్ని పనులు అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే ఆ రోజు మొత్తం చాలా చిరాగ్గా గడిచిపోతుంది. కొన్ని చిట్కాలు పాటించి కిచెన్ లోని పనులు చక, చకా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* ఎక్కువగా ఇంట్లో తోడు పెట్టిన పెరుగు వాడడానికే అందరూ ఇష్టపడుతుంటారు. పాలను తోడుపెట్టటానికి పెరుగు లేనప్పుడు, పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు ఎండుమిరపకాయలను లేదా రెండు పచ్చి మిరపకాయల ను గానీ తొడిమలతో వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. 12 గంటల తర్వాత చూస్తే చక్కటి పెరుగు తయారవుతుంది.
* వర్షాకాలంలో పప్పులు, పిండ్లు ఎక్కువగా పురుగు పడుతూ ఉంటాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే పప్పుల్లో ఎండుమిరప కాయలు లేదా బిరియాని ఆకులను వేసుకొని మూత పెట్టాలి. లేదంటే క్రిమి సంహారకంగా పని చేసే వేపాకును కూడా వాడవచ్చు.
* వెల్లుల్లి పొట్టు వలుచుకోవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. వెల్లుల్లి పొట్టు తొందరగా రావాలంటే వెల్లుల్లిని నీటిలో పావుగంట నానబెట్టకా పొట్టు వలుచుకుంటే తొందరగా వస్తుంది.
* మసాలా పొడులు, కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పురుగు పడుతూ ఉంటాయి. పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ పొడులలో కొంచెం ఉప్పు కలుపుకోవాలి.
* పచ్చిమిరపకాయలు కట్ చేస్తే చేతులు మంట వస్తాయి. అలాంటప్పుడు పచ్చి మిర్చి ని చాకుతో కాకుండా కత్తెరతో కట్ చేసుకోవాలి.
* పూరి క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే పూరి పిండి కలుపుకునేటప్పుడు పిండిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వ లేక రెండు స్పూన్ల బియ్యంపిండి కానీ కలుపుకుంటే పూరీలు క్రిస్పీగా, రుచిగా వస్తాయి.
* ఇంట్లో మిక్సీ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. అలా వాడుతుంటే మిక్సీ జార్ లో ఉండే బ్లేడ్ పదును తగ్గిపోతుంది. అలాంటప్పుడు మిక్సీ జార్ లో ఉప్పు వేసి, (రాళ్ళ ఉప్పు అయితే ఇంకా బెటర్) 30 సెకన్ల పాటు రన్ చేస్తే జార్ బ్లేడ్ షార్ప్ గా అవుతాయి.. నెలకు ఒకసారి ఇలా చేసుకుంటే మిక్సీ జార్ బ్లేడ్ పదును తగ్గకుండా ఉంటుంది.
* చపాతీలు చేసిన కాసేపటికి గట్టి పడి పోతుంటాయి. చపాతీలు మృదువుగా మెత్తగా రావాలంటే పిండి కలుపుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్లతో లేదా గోరువెచ్చని పాలతో కానీ కలుపుకుంటే చపాతీలు మృదువుగా వస్తాయి.
* పూరీలు లేదా వేపుళ్ళు చేసినప్పుడు నూనె ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అలా ఎక్కువ నూనె పీల్చు కోకుండా ఉండాలి అంటే వెగించే నూనెలో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. అప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోవు.
* అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే.. అల్లం, వెల్లుల్లి రెండింటి పొట్టు వలచుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసి ఒక బౌల్ లోకి తీసుకొని నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి ఫ్రీడ్జ్ లో పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Discussion about this post