Lokah Chapter 2: లోకా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్.. ఇప్పుడు లోక చాప్టర్ 2 అనౌన్స్ చేసిన మూవీ టీమ్
Lokah Chapter 2: మలయాళ సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై, దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (తెలుగులో ‘కొత్త లోక’). గత నెల 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 270 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో, మేకర్స్ తాజాగా ఈ సిరీస్లో రెండో భాగాన్ని (చాప్టర్ 2) అధికారికంగా ప్రకటించారు.
ఈ సిరీస్లో మొత్తం ఐదు సినిమాలు రాబోతున్నాయని సమాచారం. తొలి భాగంలో కల్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్లో నటించగా, నెస్లన్, చందు, సాయికుమార్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా, హీరో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చాప్టర్ 2 లో భారీ మార్పులు
తాజాగా విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో ప్రకారం, ‘లోక చాప్టర్ 2’లో కథానాయిక స్థానంలో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు పూర్తి నిడివి పాత్రల్లో కనిపించనుండటం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ ‘వే ఫేరర్ ఫిల్మ్స్’ నిర్మించిన ఈ తొలి భాగానికి డొమెనిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ‘చాప్టర్ 2’కి కూడా ఆయనే దర్శకత్వం వహించబోతున్నారు.
‘లోక చాప్టర్ 1 చంద్ర’ సాధించిన అద్భుత విజయం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ యూనివర్స్లో రాబోయే మిగిలిన సినిమాలు కూడా ఇదే స్థాయిలో విజయం సాధిస్తాయో లేదో చూడాలి.
కాగా.. లోక సూపర్ డూపర్ హిట్ కావడంతో దుల్కర్ సల్మాన్ తన కాంత సినిమాను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, ‘కొత్త లోక’ కలెక్షన్లు ఇంకా వస్తుండటంతో, పోటీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
‘కాంత’ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
