Mahavatar Narasimha: 15 కోట్లతో 300 కోట్లు.. ఇండియన్ సినిమాకు కొత్త పాఠం నేర్పిన మహావతార్ నరసింహ
Mahavatar Narasimha: ఈ ఏడాది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది ‘మహావతార్ నరసింహ’ చిత్రం. రూ. 15 కోట్ల స్వల్ప బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా, భారీ స్టార్ కాస్ట్ లేదా ప్రమోషన్లు లేకుండానే బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జూలై 26న విడుదలైన ఈ చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని చేరుకుంది.
దర్శకుడు అశ్విన్ కుమార్ తన ప్యాషన్తో, అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టి ఈ సినిమాను నిర్మించడం, ఆ తర్వాత అది ఊహించని విజయాన్ని సాధించడం ఒక అద్భుతమనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ విడుదలైన మరుసటి రోజున వచ్చినప్పటికీ, ‘మహావతార్ నరసింహ’ ప్రేక్షకుల ఆదరణను గెలుచుకుంది.
మొదటి రోజు రూ. 1.5 కోట్ల వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం, రెండో రోజు నాటికి రూ. 2 కోట్లకు పైగా పెరిగింది. పాజిటివ్ ‘మౌత్ టాక్’తో రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతూ, 49 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 319 కోట్లు రాబట్టింది. ఇందులో భారత్లోనే రూ. 291 కోట్లు (నెట్ రూ.247 కోట్లు) రాగా, ఓవర్సీస్ లో రూ. 28 కోట్లు వసూలు చేయడం విశేషం.
‘కాంతార’, ‘హనుమాన్’, ‘కొత్తలోకం’ వంటి చిత్రాల కోవలోనే, ‘మహావతార్ నరసింహ’ కూడా కంటెంట్ ఉన్న సినిమాకు ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి రుజువు చేసింది. కేవలం స్టార్ హీరోల పైనే ఆధారపడకుండా, బలమైన కథాంశం, మైథాలజీ, ఫాంటసీ, సూపర్ హీరో అంశాల మిళితంతో తీసిన ఈ చిత్రం, సినీ పరిశ్రమకు ఒక స్పష్టమైన సందేశం పంపింది. మంచి కథ, నాణ్యమైన నిర్మాణం ఉంటే, బాక్సాఫీస్ వద్ద విజయం తథ్యమని ఈ సినిమా నిరూపించింది. రాబోయే కాలంలో చాలా మంది సినీ నిర్మాతలు ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.