Pawan Kalyan – Rushikonda : ప్రభుత్వ భవనం విశాఖ సర్క్యూట్ హౌస్ ముఖ్యమంత్రి నివాసానికి సరిపోదా? ముఖ్యమంత్రికి ఎన్ని ఇళ్లు కావాలి..? సర్క్యూట్ హౌస్ ను అడ్డగోలుగా తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు రుషికొండ మీద కన్నేశారు. ఈయన పరిపాలించడానికి మంచి సముద్రపు వీక్షణ ఉన్న ప్రాంతం కావాలా? సముద్రపు వీక్షణ లేకపోతే పరిపాలించలేరా?’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు.
రుషికొండను అడ్డగోలుగా తవ్వేసి అక్కడ ఇష్టానుసారం భవనాలు నిర్మిస్తున్న ప్రదేశాన్ని శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. పర్యావరణ నిబంధనలను పూర్తిగా కాలరాసి నిర్మిస్తున్న భవనాల తీరును ఆయన మీడియాకు చూపించారు.
ఈ సందర్భంగా మీడియా వ్యాన్ ఎక్కి స్వయంగా మీడియా మిత్రులతో కలిసి రుషికొండ చుట్టూ ఎత్తయిన భారీ పీట్స్ వేసి లోపల చేస్తున్న భారీ భవంతుల నిర్మాణాలను ఆయన పరిశీలించి అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ..వైసీపీ నాయకుడు తెలంగాణలో ఇలా దోపిడీ చేస్తేనే అక్కడ నుంచి తన్ని తరిమేశారు.
ఇప్పుడు ఆయన కన్ను ఉత్తరాంధ్ర మీద పడింది. ఇక్కడి ప్రకృతి వనరుల మీద పడింది. నిబంధనలు, చట్టాలు పాటించాల్సిన పెద్ద మనిషి వాటిని తుంగలో తొక్కి అడ్డగోలుగా రుషికొండను తవ్వేసి మరీ భవనాలు నిర్మిస్తున్నారు. రుషికొండ విధ్వంసాన్ని మీడియా కూడా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.
గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతున్నా, కోర్టులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రుషికొండకు పూర్తిగా గుండు కొట్టి మరీ భవనాలు నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి భవనానికి రుషికొండే కావాలా..? విశాఖలో బోలెడు ప్రభుత్వ భవనాలు ఉన్నా . వాటిని వినియోగించుకోవచ్చు కదా..! అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.