Pawan Kalyan – Telangana : హైదరాబాదులోని మీర్ పేటలో మైనర్ బాలిక పైన అత్యాచార ఘటన చోటు చేసుకున్న విషయం మనందరికీ విధితమే. ఇది మానవ జాతికే తీరని మచ్చగా అభివర్ణించవచ్చు. అనాధ బాలిక పైన ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడడం అంటే రోజురోజుకీ మనిషిలో మానవత్వం మాసిపోతుంది అనడానికి ఈ అత్యాచార ఘటన నిలువెత్తు నిదర్శనం. ఈ అత్యంత హేయమైన ఘటన పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసింది. అమ్మానాన్న లేని ఆ బాలిక తన తమ్ముడితో కలసి జీవిస్తుంటే నలుగురు మృగాళ్ళు చేసిన అఘాయిత్యం మానవత్వానికి ఒక మచ్చ. బాధిత బాలిక తమ్ముణ్ణి బెదిరించి గంజాయి మత్తులో తూగుతూ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని సంరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఆ బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గంజాయి ముఠాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నాం. ఈ నగరానికీ, తెలంగాణకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో కూడా పత్రిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చెబుతూనే ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ ముఠాలను అణచివేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేయగలం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.