Pawan Kalyan – Vaj Pei : దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో.. అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి గారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేలకోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్ పేయి గారు గురించి ఏమని చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే అని పవన్ వెల్లడించారు.
అందుకేనేమో ఆయన భారతరత్నగా మనందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. విద్యార్ధి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవిచూసిన వాజపేయి గారు దేశమే జీవితం అనుకోని బ్రహ్మ చారిగానే మిగిలిపోయారు. హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన పాత్రికేయునిగా పని చేస్తూనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.

ఆయన నిర్వర్తించిన పదవులు ఎన్నో. జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్లమెంటేరియన్ గా ఆయన సుదీర్ఘంగా పని చేశారు. బిజెపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా ఆయన హయాంలో మన దేశం ఎన్నో విజయాలను చవిచూసింది. రాజస్థాన్ ఎడారిలో అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే. ప్రైవేటు రంగాన్ని పటిష్టపరచటం, దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు
రవాణా వ్యవస్థను విస్తరించటం ఆయన సాధించిన విజయాలే అని పవన్ కళ్యాణ్ ఆయన కీర్తిని గుర్తు చేసుకున్నారు. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్దాటి పార్లమెంటును అబ్బురపరిచేది. విలక్షణమైన ఆయన కవితా ఝరి పామరులను సైతం ఆకట్టుకునేది. ఇంతటి అరుదైన నాయకుడి వర్ధంతి సందర్భాన ఆ మహా నాయకునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నా పక్షాన, జనసేన పక్షాన నివాళులు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
