ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి సమీపంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఇది తమిళనాడు వరకూ విస్తరించి, భారీ ఆవర్తనంగా మారిందని తెలిపారు.
దీని ప్రభావంతో 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఈ తెల్లవారుజాము వరకూ ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి.