Shyamali De: సానుభూతి అక్కర్లేదు.. రాజ్-సమంత వివాహం తర్వాత శ్యామాలీ దే ఎమోషనల్ నోట్
Shyamali De: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్కు సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ వివాహం జరిగిన మూడు రోజులకే, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ దే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.
తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడి, భావోద్వేగ క్షోభ గురించి శ్యామలీ ఈ నోట్లో బహిరంగంగా వెల్లడించారు. “కష్ట సమయాల్లో నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాను… వాదనలు, తిరుగుబాట్లతో రోజులు గడిచిపోయాయి. నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి స్పందించకపోవడం కృతజ్ఞత లేకపోవడమే అవుతుంది. అందుకు నన్ను క్షమించండి,” అని ఆమె పేర్కొన్నారు.
అయితే ట్విన్ హార్ట్ ధ్యానం ద్వారా శాంతి, ప్రేమను ఇతరులకు చేరవేయడం నేర్చుకున్నానని, అదే తనను ఈ కష్టకాలంలో నిలబెట్టిందని శ్యామలీ వివరించారు. మాజీ భర్త రెండో వివాహంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆమె పరోక్షంగా స్పందించారు. “నా దగ్గర పీఆర్ టీం లేదు. నా సోషల్ మీడియాను నిర్వహించేవారు కూడా లేరు. నా జీవితంలో జరుగుతున్న మార్పులకు నేను వ్యక్తిగతంగానే స్పందిస్తున్నాను. ఈ పోస్ట్ను కేవలం సానుభూతి కోసం కాకుండా, నా హృదయంలోని నిజమైన భావాలను పంచుకోవడానికే షేర్ చేస్తున్నాను,” అని ఆమె స్పష్టం చేశారు.
ఇదే సమయంలో శ్యామలీ తన వ్యక్తిగత జీవితంలో మరొక తీవ్రమైన విషాదాన్ని కూడా పంచుకున్నారు. నవంబర్ 9న తన జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయిందని, అది మెదడుతో పాటు పలు అవయవాలకు వ్యాపించిందని ఆమె తెలిపారు. “ప్రస్తుతం నా దృష్టి ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోగలరు,” అంటూ ఆమె ఈ పోస్ట్ను ముగించారు. శ్యామలీ దే షేర్ చేసిన ఈ ధైర్యవంతమైన, నిజాయితీగల పోస్ట్కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తన భావాలను ఇంత బహిరంగంగా పంచుకున్నందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
