Peddi: రామ్చరణ్ ‘పెద్ది’ కీలక ఘట్టాల షూటింగ్ షురూ! క్లైమాక్స్, కుస్తీ సీన్లే మిగిలాయి
Peddi: మెగా పవర్స్టార్ రామ్చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ అంచనాల చిత్రం ‘పెద్ది’ శరవేగంగా షూటింగ్ను పూర్తి చేసుకుంటోంది. మార్చి 27న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో, పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం తగినంత సమయం కావాలని భావించిన దర్శకుడు, షూటింగ్ పార్ట్ను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే, నేటి నుంచి హైదరాబాద్లో ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో భాగంగా, నగరంలోని ఒక ప్రముఖ స్టూడియోలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే, కోఠి ఆసుపత్రి పరిసరాల్లోనూ ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
హైదరాబాద్ షెడ్యూల్ను పూర్తి చేసిన వెంటనే, ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఒక చిన్న షెడ్యూల్ కోసం టీమ్ దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నట్లు సమాచారం. అక్కడ కథలోని కొన్ని వాస్తవిక (రియలిస్టిక్) సన్నివేశాలు, మాంటేజ్ షాట్స్ను చిత్రీకరించాలని బుచ్చిబాబు ప్లాన్ చేశారు.
ఢిల్లీ షెడ్యూల్ పూర్తయితే ‘పెద్ది’ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయినట్లేనని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. మిగిలిన 10 శాతం షూటింగ్లో కేవలం మూడు ప్రధానమైన ఘట్టాలు మాత్రమే ఉన్నాయట. వాటిలో ఒకటి భావోద్వేగభరితమైన క్లైమాక్స్ ఎపిసోడ్ కాగా, రెండోది అభిమానులకు గూస్బంప్స్ తెప్పించే విధంగా డిజైన్ చేసిన కుస్తీ (రెజ్లింగ్) సీక్వెన్స్. ఇక మూడోది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేసిన ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్. ఈ మూడింటిని పూర్తి చేస్తే సినిమా చిత్రీకరణ పూర్తయినట్లేనని నిర్మాతలు తెలిపారు.
జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్వేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంగీత మేస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చుతుండగా, కెమెరామెన్గా ఆర్. రత్నవేలు పనిచేస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.
