ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా మూలంగా మార్చి నెల నుంచి విద్యాసంస్థలు మూతపడ్డ క్రమంలో తమకు సెమిస్టర్ పరీక్షల సమాచారం కూడా సక్రమంగా ఇవ్వకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేయడంపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో వేల కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లాలంటే భయంగా ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి సెమిస్టర్ లో ఎనిమిది పరీక్షలు ఉంటాయనీ ప్రస్తుతం స్వస్థలాల్లో ఉన్న విద్యార్థులు మళ్ళీ కాలేజీలు ఉన్న ప్రాంతానికి ఎలా పంపించాలని కన్నవారు ఆవేదన చెందుతున్నారు. అలాగే సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులు ఏ మేరకు సన్నద్ధం ఉన్నారో కూడా జి.ఎస్.టి.యు. వర్గాలు కూడా సరిగా అంచనాకు రాలేదు. వారి ఆవేదనను సంబంధిత విశ్వవిద్యాలయాలకు చెబుతున్నా స్పందించకుండా పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్ళడం భావ్యం కాదు. మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల గురించి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సానుకూలంగా ఆలోచించాలి. ఇతర రాష్ట్రాల విద్యాశాఖ, ఎస్.ఐ.టి సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో అనుసరించిన విధానాన్ని, యూజీసీ మార్గ దర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. సెమిస్టర్ పరీక్షల నిర్వహణను నిలుపుదల చేసి విద్యార్థులు మానసిక ఒత్తిడిని తగ్గించాలి అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.