Shraddha Kapoor: ‘ఈఠా’ షూటింగ్లో శ్రద్ధా కపూర్కు తీవ్ర గాయం.. డ్యాన్స్ చేస్తూ కాలి వేలికి ఫ్రాక్చర్
Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ షూటింగ్ సెట్లో గాయపడిన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 22న ఆమె తన రాబోయే చిత్రం ‘ఈఠా’ కోసం లవణీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్యాన్స్ రిహార్సల్స్ సమయంలో అదుపు తప్పి కిందపడటంతో ఆమె ఎడమ కాలి వేలికి ఫ్రాక్చర్ అయ్యిందని, గాయం తీవ్రంగా ఉందని సమాచారం.
శ్రద్ధా ఈ సంఘటన గురించి వివరిస్తూ, సంప్రదాయ నౌవరీ చీర ధరించి, భారీ ఆభరణాలతో డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని, దానివల్ల కండరాలపై అదనపు ఒత్తిడి పెరిగిందని తెలిపింది. తన పాత్ర కోసం ఆమె ఏకంగా 15 కిలోల బరువు కూడా పెరగడంతో, డ్యాన్స్ మూమెంట్స్ చేసేటప్పుడు శారీరక శ్రమ మరింత పెరిగిందని వెల్లడించింది. గాయం అయినప్పటికీ, కనీసం క్లోజప్ షాట్స్ అయినా పూర్తి చేద్దామని శ్రద్ధా కోరినప్పటికీ, గాయం ముదిరే ప్రమాదం ఉందని భావించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెంటనే షూటింగ్ను నిలిపివేయించారు. ఈ ఊహించని సంఘటన కారణంగా ‘ఈఠా’ మూవీ షూటింగ్ షెడ్యూల్ కొంతకాలం పాటు వాయిదా పడింది.
గాయపడిన తర్వాత శ్రద్ధా కపూర్ తన ఆరోగ్యం గురించి అభిమానులకు తెలియజేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. “నాకు కండరాల చిరుగు (మసిల్ టియర్) ఏర్పడింది. అయితే నేను ఒక టెర్మినేటర్ లాగా తిరుగుతున్నాను. నాకు కొంచెం విశ్రాంతి అవసరం. త్వరలోనే పూర్తిగా కోలుకుని సెట్లోకి తిరిగి వస్తాను,” అంటూ శ్రద్ధా తన ఫ్యాన్స్కు ధైర్యం చెప్పింది.
ఆమె నిర్వహించిన ‘ఆస్క్ మీ క్వశ్చన్’ సెషన్లో అభిమానులు ఆమె కాలి గాయం గురించి ప్రత్యేకంగా అడగ్గా, ప్లాస్టర్ వేసుకున్న కాలి వీడియోను కూడా షేర్ చేసింది. తమ అభిమాన నటి గాయపడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నప్పటికీ, ఆమె త్వరలోనే కోలుకుని, మళ్లీ చలాకీగా సెట్లోకి వస్తుందన్న నమ్మకాన్ని, ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.
