నల్లగొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు బీటీఎస్ ప్రాంతంలో గల ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు చొరబడ్డారు. అయితే, దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా ముందు జాగ్రత్తగా ఏటీఎం వెలుపల, లోపల ఉన్న మొత్తం నాలుగింటికి నల్లరంగు వేశారు. అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం తెరిచి నగదును అపహరించుకుపోయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే మిర్యాలగూడ రోడ్డులోని ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త ఏటీఎంను వదిలేసి పాత ఏటీఎంను గ్యాస్ కట్టర్తో తెరిచి చోరీకి పాల్పడిన తీరు అంతర్రాష్ట్ర ముఠా పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఉంటుందని, పాత ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ గోపి, టూటౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చోరీ జరిగిన ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి దుండగులు వేలిముద్రలు, పాదముద్రలు, తల వెంట్రుకలు తదితర కీలక ఆధారాలు సేకరించారు. అయితే, చోరీ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.