“పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి” అనేది విజయ సూత్రం. ఇప్పుడు అదే సూత్రాన్ని అమలులోకి తీసుకొచ్చింది జనసేన పార్టీ. గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. ఈ నియోజకవర్గ పరిధిలో జనసేనకు మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అండతో గెలిచిన రాపాక రాజకీయ కారణాలు చూపించి వైసీపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు. తమ అండతో గెలిచిన రాపాక ప్లేటు ఫిరాయించి ఇంకో పార్టీతో అంట కాగడం వలన క్యాడర్ మొత్తం ఆయనపై భగ్గుమంటున్నారు. అంతేకాక రాపాక ఎన్నికల అనంతరం జనసేన పార్టీ నిర్వహించిన క్రియాశీలక సమావేశాలుకు గైర్హాజరు కావడం, వైసీపీ ప్రభుత్వ విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రశంసించడం, నేరుగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపించడం జనసేన పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఒక దశలో రాపాక పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆలోచించినా పార్టీకి దళిత వ్యతిరేక ముద్ర పడుతుందనే భయంతో వెనక్కి తగ్గి,ఇప్పుడు అదను చూసి రాపాక ను దెబ్బ కొట్టే విధంగా వ్యూహాలను రచిస్తోంది.
వైసిపి అండతో నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అనేక అవకతవకలను చూస్తూ ఇలాంటి వ్యక్తినా మనం గెలిపించింది అని మనసులో ఆవేదన చెందుతున్న కార్యకర్తలను, ఇసుక రవాణాలో తమ ప్రాంత ఎమ్మెల్యే చేస్తున్న అవకతవకలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకూ వెళ్లి పోరాటం చేస్తున్న వారిని సమీకరించి వారిని రాపాక పై అస్త్రంగా మార్చేలా వ్యూహాన్ని రచించింది. జనసేన తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం తూర్పుగోదావరిలో హాట్ టాపిక్ గా మారింది.
పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు పై తొలి అడుగు వేయడం శుభపరిణామం. రాష్ట్రంలో ఐదు నియోజకవర్గాల పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టి ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మొదలు పెట్టడం పార్టీ కార్యకర్తల్లో జోష్ తీసుకు వచ్చింది. అయిదు వందల రూపాయల విలువ గల ఈ సభ్యత్వంపై జీవిత భీమా కూడా అందజేస్తూ ఏదైనా ప్రమాదంలో కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
పైలెట్ ప్రాజెక్టు లో ఉన్న అన్ని నియోజకవర్గాలని పక్కన పెడితే ఇటీవలే జరిగిన కొన్ని పరిణామాల వల్ల రాపాక పార్టీపై చేసిన విమర్శలకు సమాధానం గా ఇక్కడ అత్యధికంగా సభ్యత్వం చేయించి చేసి సవాల్ విసరడానికి రంగం సిద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్ణయం తెలుసుకున్న రాపాక వర్గీయులు కొంత ఆందోళనలో పడ్డారు. పార్టీ బలంగా ఉన్న రాజోలు పై దృష్టి పెట్టడం తో రాపాకను టార్గెట్ చేసినట్లు ఎమ్మెల్యే వర్గీయులు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు విఫలమైతే అప్పుడు దీనిపై వాళ్లు స్పందించే అవకాశం ఉంది.రాజోలు లో జరుగుతున్న రసవత్తరమైన రాజకీయాలుపై స్థానికులే కాదు రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు కూడా ఏం జరుగుతుందనే ఆసక్తితో చూస్తున్నారు.
