Telugu Movies Shooting: 30 శాతం వేతనాలు పెంచిన నిర్మాతల సినిమాలకే పని చేస్తాం..!
Telugu Movies Shooting: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న వేతనాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. కార్మికుల వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (TFIEF), ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 30 శాతం వేతన పెంపునకు అంగీకరించిన నిర్మాతల చిత్రాల షూటింగ్లకు మాత్రమే హాజరు కావాలని, లేనిపక్షంలో నేటి (సోమవారం, ఆగస్టు 4) నుంచి విధులకు దూరంగా ఉండాలని ఫెడరేషన్ తన సభ్యులకు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్లో పలు సినిమాల షూటింగ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ఆదివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఫెడరేషన్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కేవలం 5% పెంపునకు మాత్రమే నిర్మాతల మండలి సుముఖత చూపడంతో, దానిని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. తమ డిమాండ్ నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశాయి. ఈ పోరాటాన్ని ముందుకు నడిపించేందుకు వీరశంకర్, సయ్యద్ హుమయూన్ల నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
నిబంధనలు ఇవే..
ఫెడరేషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, 30% వేతన పెంపునకు అంగీకరిస్తూ నిర్మాతలు ఒప్పంద పత్రాన్ని ఫెడరేషన్కు అందజేయాలి. ఆ పత్రం అందిన తర్వాతే కార్మికులు విధులకు హాజరవుతారు. అప్పటివరకు ఎలాంటి సినిమా, వెబ్ సిరీస్, ఇతర భాషా చిత్రాల షూటింగ్లలోనూ పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. తెలుగు సినిమాల షూటింగ్లు ఏ రాష్ట్రంలో జరిగినా ఈ నిబంధనలు వర్తిస్తాయని ఫెడరేషన్ తేల్చి చెప్పింది.
వాయిదా పడిన అల్లరి నరేష్ సినిమా..
సోమవారం ప్రారంభం కావాల్సిన అల్లరి నరేష్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. పరిశ్రమలో పరిస్థితులు చక్కబడిన తర్వాతే సినిమాను ప్రారంభిస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
