అరటిపండు.. చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఇష్టంగా తినే పండు. మార్కెట్లో అతితక్కువ ధరకు లభించే పండుకూడా ఇదే. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందుకే ప్రతిఒక్కరూ రోజులో 2 లేదా 3 అరటిపండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. అయితే, ఎక్కువ మొత్తంలో తింటామంటే మాత్రం కుదరదు. అరటిపండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
బరువు తగ్గొచ్చు:
అధిక బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ అరటి పండును తినొచ్చు. ఒక్క అరటి పండులో 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటి పండు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు.
శక్తి స్థాయిని పెంచుతుంది:
అరటి పండ్లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ కంటే అరటి పండ్లు ఆరోగ్యకరమైవి. అందుకే రోజుకు 2 అరటి పండ్లు తింటే.. మనం రోజువారీ కార్యకలాపాలు చేసుకునేందుకు కావాల్సిన శక్తి వస్తుంది.
చర్మ సౌందర్యం:
రోజూ అరటి పండ్లను తినడం వల్ల చర్మంపై ముడతలు, మొటిమలు, పొడి చర్మం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
కంటిచూపు మెరుగు:
ప్రతిరోజూ అరటి పండ్లు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నిద్రలేమికి చెక్:
స్లీపింగ్ పిల్ వేసుకోకుండా అరటి పండును తినండి. అరటి పండులో అధిక మెగ్నీషియం, పొటాషియం మరియు ట్రిప్టోఫాన్ కంటెంట్ కారణంగా హాయిగా నిద్ర పడుతుంది.
హ్యాంగోవర్కు మందు:
హ్యాంగోవర్లకు అరటి పండు సరైన పరిష్కారం. అరటి పండులో సహజమైన యాంటాసిడ్ ఉంటుంది కాబట్టి తలనొప్పి, వికారం నుంచి బయటపడొచ్చు.
బీపీ కంట్రోల్:
అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మెరుగైన రక్షణను ఇస్తుంది. అంతేకాదు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది.
