లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు, భారత్ లో తక్కువ కేసులు ఉన్నప్పుడు కోవిడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ప్రజలు, అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చాలా వరకు అన్ని జాగ్రత్తలను గాలికి వదిలేశారు, అసలు మన ప్రమేయం లేకుండా గాలి ద్వారా వచ్చే వ్యాధి గురించి పట్టించుకోవడం మానేసారు.
కానీ వైద్యరంగ నిపుణులు, వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రాబోయే కాలంలో ఎదుర్కొనే విషమ పరిస్థితుల గురించి హెచ్చరిస్తున్నారు. భారత్ లో మరికొన్ని వారాల్లో శీతాకాలం రానుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే కొన్నినెలల పాటు అత్యంత శీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి చలి వాతావరణంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశాలు అధికం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అభిప్రాయపడ్డారు.
యూరప్ లో కరోనా మహమ్మారి తిరగబెడుతోందని, నెమ్మదించినట్టే నెమ్మదించి మళ్లీ విరుచుకుపడుతోందని, భారత్ లో రాబోయేది చలికాలం కావడంతో భారత్ లో ఈ వైరస్ తీవ్రమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్టు పాల్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని, అయితే అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే భద్రపరిచేందుకు కావాల్సినన్ని కోల్డ్ స్టోరేజిలు ఉన్నాయని వెల్లడించారు. ఇదే విషయంపై ప్రధాని మోడీ నిన్న విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే త్వరితగతిన పౌరులకు అందించడానికి ఎటువంటి ఏర్పాటు చేయాలో నిన్నటి సమావేశంలో చర్చించారు.
ఇక రాబోయే శీతాకాలంలో ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.