Pawan Kalyan: నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, ఎ.ఎం. రత్నం నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
తనదైన శైలిలో నవ్వుతూ, పోడియం లేకుండా మాట్లాడటం కష్టంగా ఉందంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “నా సినీ జీవితంలో మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి. సినిమాను ఎలా ప్రచారం చేసుకోవాలో నాకు తెలియదు. దీని కోసం ఎంత కష్టపడ్డాం అని చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది,” అని పవన్ అన్నారు. తాను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన ఫోటోలు కూడా పేపర్లలో రాలేదని, ప్రచారం లేకుండానే తన సినిమాలు విడుదలయ్యేవని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రెస్మీట్కు ప్రధాన కారణం నిర్మాత ఎ.ఎం. రత్నమే అని ఆయన స్పష్టం చేశారు.
‘హరి హర వీరమల్లు’ వెనుక కఠిన సవాళ్లు, కోహినూర్ వజ్రం కథ:
“ఒక సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. మన చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఎ.ఎం. రత్నం. ఈ సినిమా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. నేను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాకు సమయం కేటాయించలేకపోయాను. అయినప్పటికీ నా వంతు కృషి చేశాను. గతంలో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు చాలా ఉపయోగపడ్డాయి,” అని పవన్ వివరించారు. ఈ సినిమా క్లైమాక్స్ దీనికి ఆయువుపట్టు అని, కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుందని పవన్ తెలిపారు. దర్శకుడు క్రిష్ అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చారని, ఆయనకు చిత్ర బృందం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

“కొన్నిసార్లు పరిశ్రమ చాలా కఠినంగా ఉంటుంది. రత్నం చాలా ముందుచూపు ఉన్న నిర్మాత. ఆయన ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. ఈ సినిమా పూర్తవుతుందా లేదా అని అనుకున్న సమయంలో ఎం.ఎం. కీరవాణి ప్రాణం పోశారు. కొన్నిసార్లు డబ్బులు, విజయం కోసం కాదు, పరిశ్రమ బాగుకోరే వ్యక్తులకు అండగా నిలబడటం ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు విమర్శిస్తున్నా ఈ సమావేశానికి వచ్చాను. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా రత్నం పేరును ప్రతిపాదించాను. సినిమా నాకు అన్నం పెట్టింది, అది నాకు ప్రాణవాయువుతో సమానం,” అని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.
రాజకీయాలు, సినీ పరిశ్రమ, మరియు ప్రతిభకు ప్రాధాన్యత:
“ఇతర హీరోలకు బిజినెస్ అయినంతగా నా సినిమాలకు అవ్వదు. నేను ప్రజల కోసం దృష్టిపెట్టాను. బాబీ డియోల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రచార బాధ్యతను నిధి తన భుజాలపై వేసుకుంది. ఈ సినిమా అనాథ కాదు.. నేనున్నా అని చెప్పడానికే వచ్చాను. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని. దేశ సమస్యల కోసం పోరాటాలు చేసేవాడిని. నా సినిమాకు అండగా ఉండలేనా అనిపించింది. నా సినిమాల సమయంలో గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని మీకూ తెలుసు. మన ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఎంతో ఆదరిస్తోంది. అందుకే ఈ సినిమా ప్రచారంలో భాగం కావాలని వచ్చాను,” అని పవన్ స్పష్టం చేశారు.
భారతీయ సినిమాకు కుల, మత భేదాలు ఉండవని, క్రియేటివిటీ మీదనే ఆధారపడి ఉంటుందని పవన్ పేర్కొన్నారు. “చిరంజీవి కుమారుడైనా, తమ్ముడైనా ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలబడలేరు. రేపు నా కుమారుడైనా అంతే. ఇక్కడ ప్రతిభే ముఖ్యం,” అని పవన్ నొక్కి చెప్పారు.
వ్యక్తిగత కష్టాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రభావం:
“ఈ సినిమా కోసం తెల్లవారుజామున 2 గంటలకు లేచి కష్టపడేవాడిని. జ్యోతికృష్ణ చాలా సత్తా ఉన్న దర్శకుడు. ఈ సినిమా ఫలితం పూర్తిగా ప్రజల చేతిలో ఉంటుంది. మిగతా వారితో పోలిస్తే నేను కొన్ని పనులు చేయలేను. ‘సుస్వాగతం’ సినిమాలో బస్సు మీద ఎక్కి డ్యాన్స్ చేయమన్నారు. నేను చేయలేక చచ్చిపోయా. సినిమాలు చేయలేను, మానేస్తాను అని మా వదిన (చిరంజీవి సతీమణి సురేఖ)కు కూడా చాలాసార్లు చెప్పాను. యాక్షన్ సీక్వెన్స్లు కూడా మార్షల్ ఆర్ట్స్ చేశాను కాబట్టి అవగాహన ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని వేరు చేయడం నాకు నచ్చదు,” అని పవన్ తన మనసులోని మాటను పంచుకున్నారు.
ఈ సమావేశంలో దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, సినిమాలో 20 నిమిషాల ఫైట్ సన్నివేశానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారని వెల్లడించారు. పవన్తో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు.
