Santosh Movie OTT: సెన్సార్ అభ్యంతరాలను దాటి: అంతర్జాతీయ అవార్డులు గెలిచిన ‘సంతోష్’ ఓటీటీలోకి!
Santosh Movie OTT: భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాల కారణంగా థియేటర్లలో విడుదల కాలేకపోయిన హిందీ చిత్రం ‘సంతోష్’, ఎట్టకేలకు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కుల హింస, లింగ వివక్ష, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవస్థీకృత అవినీతి, పోలీసుల క్రూరత్వం వంటి సున్నితమైన అంశాలను అత్యంత వాస్తవికంగా ఈ సినిమాలో చూపించారని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని కారణంగా, CBFC అధికారులు సినిమాలో ఎక్కువ భాగాలను కత్తిరించాలని (కట్స్), ముఖ్యంగా కొన్ని పాత్రల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. అయితే, మేకర్స్ అందుకు అంగీకరించకపోవడంతో, సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడానికి బోర్డు నిరాకరించింది.
భారతీయ ప్రేక్షకులు నిరాశపడినప్పటికీ, ఈ చిత్రం బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా విడుదల అయింది. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్) పోటీ చేసి అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికి సంధ్యా సూరి దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గ్రహీత షహానా గోస్వామి ప్రధాన పాత్ర సంతోష్ సైనీగా నటించారు.
ఈ సినిమా కథ ఉత్తర భారతదేశంలోని కుల ఆధిపత్యం, లింగ వివక్ష ప్రబలంగా ఉన్న ప్రాంతంలో నడుస్తుంది. భర్త మరణానంతరం, అతని ఉద్యోగాన్ని స్వీకరించి పోలీసు కానిస్టేబుల్గా మారిన యువ వితంతువు సంతోష్ సైనీ (షహానా గోస్వామి) చుట్టూ కథ అల్లుకుంది. కానిస్టేబుల్గా చేరిన సంతోష్కు ఒక క్రూరమైన నేరాన్ని పరిశోధించే బాధ్యత అప్పగిస్తారు. ఈ దర్యాప్తులో ఆమె తెలుసుకున్న వాస్తవాలు, సమాజంలో ఎదురైన సవాళ్లే ఈ కథాంశం. థియేటర్లలో మిస్సైన ఈ పవర్ఫుల్ చిత్రాన్ని ఓటీటీలో చూడాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.