Janasena Party : పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ఆయన బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఫలించడం లేదు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇన్ఛార్జి మురళీధరన్ మాత్రమే పవన్ కలవగలిగారు. అంతకు మించి ఆయన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు. ఎన్నికలు సమీపిస్తుండటం, వారాహి యాత్రను కూడా త్వరలో ప్రారంభించాల్సి రావడంతో పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దల వద్దనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమై హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నారు.
మరోసారి రోడ్ మ్యాప్ ఎపిసోడ్ తెరపైకి: పవన్ ఢిల్లీటూర్ తో మరోసారి రోడ్ మ్యాప్ ఎపిసోడ్ వచ్చినా పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డాతో జరిపే చర్చల్లో ఈ విషయంపై స్పస్టత రాలేదు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని పవన్ కల్యాణ్ నుంచి సరైన సహకారం అందలేదంటూ ఏపీ బీజేపీలో కీలక నేతలు వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది. టిడిపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని, తమ పొత్తు జనసేనతో మాత్రమేనని బిజెపి రాష్ట్ర నేతలు కరాఖండిగా చెబుతున్నారు.
జనసేన తమతోనే ఉందని బిజెపి రాష్ట్ర నేతలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రాబల్యం భారతీయ జనతా పార్టీకి ఏ మేర బలాన్ని ఇస్తుందో అన్నది బిజెపి రాష్ట్ర నేతలకు సైతం అంతుచిక్కని ప్రశ్న? అలాగే దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీని మారనున్నారని సంకేతాలు అందుతున్న తరుణం ఆమె ఏ పార్టీ వైపు మెగ్గుచూపుతారో.. భారతీయ జనతా పార్టీ లోనే కీలకంగా వ్యవహరిస్తారో వేచి చుడాలి.
పవన్ పయనం ఎటువైపు :
భారతీయ జనతా పార్టీ జనసేన రెండు పార్టీలూ కలిసి పోరాటం చేయడంలేదు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోలేక పోయాయి. బిజెపి జాతీయ నేతలు తమ పట్ల సానుకూలంగా ఉన్నా రాష్ట్ర నాయకత్వం సరిగా వ్యవహరించడం లేదని పవన్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ సూచిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్నారే కానీ, పొత్తులపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
టీడీపీ వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా ఉంది. సీట్ల విషయంలో పవన్ తో గీచి గీచి బేరాలాడుతోంది. ఇవి ఎడతెగకుండా సాగుతున్నాయి. ఈ దశలో అసలు బీజేపీ సంగతేంటో తేల్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు పవన్. ఏపీలో ఏ ఉప ఎన్నికలోనూ జనసేనకు బీజేపీ అవకాశం ఇవ్వలేదు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేనతో సంప్రదించకుండానే అభ్యర్థుల్ని నిలబెట్టి పరువు తీసుకుంది. జనసేన మాత్రం సైలెంట్ గా టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది.
దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు పవన్ పై అక్కసు వెళ్లగక్కారు. కానీ బయట పడటంలేదు. అమిత్ షా కొంత టీడీపీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారన్న సమాచారం అమిత్ షా అందుకు అంగీకరిస్తే తాను పొత్తుపై చర్చలు ప్రారంభించవచ్చన్న ఆలోచనతో ఉన్నారు. అమిత్ షా నుంచి కలవాలని మాత్రం పిలుపు రాకపోవడంతో పవన్ కొంత అసహనంతోనే ఉన్నారని తెలిసింది మరోవైపు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బిజెపి అధిష్టానం భావిస్తున్న దృష్ట్యా ఈ విషయమై చర్చించేందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.
తెలుగు వారి ప్రాబల్యం వున్న నియోజక వర్గాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కసరత్తు చేసే పని నల్లారి వారికి ఆప్పగించింది ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ప్రాబల్యమే ఎక్కువ. బళ్లారి, రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్ ది కీలక వర్గం. మరి ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ సేవలని వినియోగించుకోవాలని బిజెపి భావిస్తోంది. బిజెపి ఆభ్యర్దుల నిర్ణయంపై ఢిల్లీలో జరిగిన భేటిలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది.
జన సైనికులపై పవనం ప్రభావం..
టిడిపి నేత చంద్రబాబు కూడా మోదీ తో దోస్తికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దిశగా సృజనా చౌదరిని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ పరిణామాలు పరిశీలిస్తే బిజెపి-టిడిపి-జనసేన పోత్తు మళ్ళీ బలంగా వినిపిస్తోంది. టిడిపి తమ్ముళ్ళు, జనసైనికులు స్పందన ఎలా వుంటుందో, ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జన సైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందాల్సిన అవసరం లేదు.
ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు అవసరంలేదు గెలుపై జన సైనికులు భరోసా ఇస్తే ఒంటరిగానే పోటీ చేస్తాం. లేదంటే షరతుతో కూడిన పొత్తుకు వెళ్తాం అన్నది పవన్ వ్యూహం. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టడానికి తమ అధినేత సిద్ధపడ్డారని, అటువంటి వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకు లొంగరని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పొత్తుల కత్తులతో జరిగే ఎన్నికల రణంలో విజయం ఎవరిదో..!?