న్యూ ఇయర్ వేడుకలు తెలంగాణ ప్రభుత్వానికి కాసులు వర్షాన్ని కురిపించాయి. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులైపారింది(Telangana Liquor Sales). రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ నమోదు అయ్యాయి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టూ మందుబాబులు తెగ తాగేశారు. డిసెంబర్ 31 రోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. శనివారం ఒక్క రోజు అబ్కారీ శాఖకు రూ. 215.74 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈసారి డిసెంబర్ 31 శనివారం రావడంతో గతంతో పోలిస్తే అమ్మకాలు తగ్గినప్పటికీ, పెరిగిన రేట్ల కారణంగా భారీగానే ఆదాయాన్ని ఆర్జించింది ఎక్సైజ్ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 మద్యం డిపోల నుంచి జరిగిన రిటైల్ అమ్మకాల వివరాలు జనవరి 1 ఉదయం 12 గంటల వరకు ఇలా ఉన్నాయి. సుమారుగా 2,17,444 లిక్కర్ కేసులు, సుమారుగా 1,28,455 బీర్ కేసులు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్ డిపో-1 నుంచి 15,251 లిక్కర్ కేసులు, 4,141 బీర్ కేసులు అమ్ముడవ్వగా రూ.16.90 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ 2 డిపో నుంచి 18,907 లిక్కర్ కేసులు అమ్ముడవ్వగా.. 7,833 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. రూ. 20.78 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ రెండు డిపోల్లో కలిపి రూ.37.68 లక్షల ఆదాయం వచ్చింది. ఇక జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం రాత్రి 1 గంటల వరకు వైన్స్ కు అనుమతి ఇవ్వడంతో సేల్స్ బాగానే పెరిగాయి.
