అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు. నిమజ్జనం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? తెలుసుకుందాం రండి..
వినాయక చవితి పండుగ యావత్తు ప్రకృతి నియమాలపై ఆధారపడి జరుగుతుంది. వాగుల్లో దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను తయారు చేస్తాం పత్రి పేరుతో 21 రకాల ఆకులతో ఆయనని పూజిస్తాం. ఇలా అలంకరించిన స్వామిని ఆయనను పూజించిన పత్రి తో సహా నిమజ్జనం చేస్తాం. సృష్టి స్థితి లయ అనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి. వాటికి విరుద్ధంగా పూజ సాగింది అంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైంది అని అర్థం.
పూజలో మట్టి విగ్రహం పత్రి ఉపయోగించడం వెనుక కూడ మరొక కారణం ఉంది.ఒండ్రు మట్టి లోను పత్రి లోనూ ఔషధ గుణాలు దాగి ఉంటాయి. గణనాథుడికి చేసే షోడశోపచార పూజలో భాగంగా వీటిని పదే పదే తాకడం వల్ల వాటిలోని ఔషధీ తత్వం మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఒక తొమ్మిది రోజులు ఆ విగ్రహాన్ని పత్రిని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఔషధ గుణాలు గాలి ద్వారా ఇల్లు మొత్తం వ్యాపిస్తాయి.. ఆ తర్వాత విగ్రహాన్ని పత్రిని దగ్గరలో ఉన్న చెరువులోనో, నదిలోనో నిమజ్జనం చేస్తాం. ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి శేషము మిగలదు.
అంతేకాక వినాయక చవితి నాటికి వర్షాలు ఊపు అందుకుంటాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు కాబట్టి నీళ్ళలో వదిలే పత్రి వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలవడం వల్ల నీరు క్రిమిరహితంగా అవుతుంది.
అంతేకాక వినాయక నిమజ్జనంలో ఒక సామాజిక అంశం కూడా ఉంది. వాడవాడలా వినాయక విగ్రహాలు పెట్టడం వల్ల ఇరుగుపొరుగు కలిసిమెలిసి పండుగ చేసుకొని బంధాలను పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో భక్తి శృతిమించి పరువు కోసం పాకులాడుతూ ఒకరికి ఒకరు గొప్ప అని చెప్పుకోవడానికి రంగు విగ్రహాలు వాడుతున్నారు.వాటిని నదులు-చెరువుల్లో కలపడం వల్ల నీరు కలుషితమై ప్రకృతికి నష్టం కలుగుతుంది. అంతేకాక ఎక్కువ శబ్దాలు వచ్చే లౌడ్ స్పీకర్లు,డీజే బాక్సులు శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నాయి. మనిషి ప్రకృతిని కొలవడం ప్రకృతి ధర్మాలు పాటించడం మాని ఆడంబరాల కోసం పాకులాడటం వల్ల ప్రకృతి వినాశనానికి కారణమై భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
–వెంకట్