Kalasham : భారతదేశం అంటేనే పూజలకు, పుణస్కారాలకు, ఆచార సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ దేశంలో దేవాలయాలు ఎన్నో ఆచరించే, పూజించే దేవుళ్ళు ఎందరో. అయితే పూజలో వాడే ఒక ప్రత్యేక వస్తువు గురించి ఇప్పుడు చెప్పు కుందాం. కలశం దీని గురించి తెలియని వారు ఉండరు. ప్రతిరోజు దేవాలయంలో నిత్య పూజలు జరుగుతూ ప్రతి ఆలయం శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.
దేవాలయం పూజలలో ఉపయోగించే ఒక్కో వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే కలశానికి కూడా ఒక స్థానం ఉంది. దోషా నివారణకు ఈ కలశాన్ని పూజలో ఉంచుతారు. ఈ కలశమును ఎలా రూపొందిస్తారో ఇప్పుడు చూద్దాం..ముందుగా ఒక రాగి చెంబును తీసుకొని దానిపైన వెండి చెంబును కలశంగా పెడతారు. దానికి కుంకుమ, పసుపులను అలంకరించి,ఆ కలశంలో కొంత నీటిని పోసి వాటిలో కుంకుమ, పసుపు, పూలు, గంధం అక్షింతలు కలుపుతారు.
కలశంపై మామిడి ఆకులు చుట్టూ ఉండేలా అలంకరించి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. ఆ తర్వాత కొబ్బరికాయకు శుభ్రమైన వస్త్రాన్ని చుట్టి పూజిస్తారు. అయితే పూజ తర్వాత ఆ కొబ్బరికాయను ఏం చేస్తారని చాలామందికి అనుమానంగా ఉంటుంది. ఆలయాలలో అయితే ఈ కలశానికి ఉపయోగించినటువంటి కొబ్బరికాయను పూర్ణాహుతికి వాడుతుంటారు.
ఒకవేళ ఇళ్లల్లో అయితే నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. లేకపోతే దగ్గర్లో ఏదైనా జలాశయం ఉంటే దాంట్లో నిమజ్జనం చేస్తారు. ఒకవేళ నోములు, వ్రతాల సమయంలో పీఠం పై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటాం కాబట్టి వాటితో పాటు ఈ కొబ్బరికాయను కూడా ఇస్తారు. అలా ఇవ్వడం వలన ఆ కుటుంబంలో ఉన్న దోషాలు పోతాయని పండితులు చెబుతుంటారు.