Spirituality : పురాణాల ప్రకారం దానాలు చేయడం వల్ల దోషాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. స్వయంగా ఆ పరమేశ్వరుడే ,పార్వతీదేవికి దానం చేయమని చెప్పి, వాటి వల్ల కలిగే లాభాలను,శుభాలను బోధిస్తాడు. అయితే ఏ రకాల వస్తువులు దానం చేయాలి, ఫలితాలు పొందాలంటే ఎలాంటి దానాలు శ్రేయస్కరం ఇప్పుడు తెలుసుకుందాం.
దానాలలో కంటే అతి ముఖ్యమైన దానం అన్నదానం. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడం కంటే గొప్ప పని లేదని చెప్పవచ్చు. దేహీ అని ఇంటి ముందుకు వచ్చిన వారికి అన్నము, నీరు ఇచ్చి ఆకలి తీరిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని కార్తీక పురాణంలో ప్రస్తావించబడిందని పండితులు చెబుతున్నారు.
కొంతమందికి పెళ్లిలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. సంబంధాలు ఎన్ని చూసినప్పటికీ వివాహం జరగక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటివారు బంగారాన్ని దానం చేస్తే తొందరగా వివాహం జరుగుతుంది. బంగారం అగ్నితో సమానం ఎలాంటి దోషాలైనా అగ్నితో బూడిద అయిపోయి అనుకున్న పనులు సమయానికి జరుగుతాయి.
చనిపోయిన ప్రతి ఒక్కరు స్వర్గలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటారు. స్వర్గలోకం అందాలంటే బ్రాహ్మణునికి గోవును దానం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. గోవుపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు వారికి స్వర్గలోకం దక్కుతుందని. అలాగే దూడతో పాటు ఉన్న ఆవును దానం చేస్తే వారి యొక్క కుటుంబంలో 21 తరాల వరకు కూడా స్వర్గలోకం ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
భూదానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. భూదానం చేయడం వల్ల సర్వ సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆ తర్వాత కన్యాదానం గొప్పదని చెప్తారు. కన్యాదానం చేయడం వల్ల వారి వంశం వృద్ధి చెందడమే కాక, స్వర్గం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఎవరికైనా విద్యాదానం చేయడం వల్ల కూడా కుటుంబ వృద్ధికి దోహదపడుతుంది. ఒక వ్యక్తి సుఖసంతోషాలు పొందాలి అంటే.. స్త్రీలకు విద్యాదానం చేయడం మంచిది.