మనుషులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం. ఇంతకీ పాపం అంటే ఏమిటి ? పుణ్యం అంటే ఏమిటి ?
“పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం” అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.
పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి.
పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి. పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాపఫలమే కాక వేరొకటి కాదు.
పాపదోషం అనుభవించితే తప్ప పోదు. అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి..!
“ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం” అని విదురవాక్కు. పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.
ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం. తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది.
ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి రేపు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి.
Discussion about this post