ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో ఆయన తనయుడు బాలకృష్ణ తప్ప మిగిలిన వారు కాడి వదిలేసి పక్కకి వెళ్లి పోయారు. చంద్రబాబే లేకుంటే ఎన్టీఆర్ తర్వాత టిడిపి పరిస్థితి ఇలా ఉండేది కాదు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
చంద్రబాబు తన 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను సవాళ్లను ఎదుర్కొని పార్టీ కార్యకర్తలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇంతకాలం పార్టీని నడిపించుకుంటూ వచ్చారు. పార్టీలో సంక్షోభం ఎదురైన ప్రతి సారి తన చాకచక్యంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తెలుగుదేశం పార్టీని ధీటైన స్థానంలోనే ఉంచారు అనడం అతిశయోక్తి కాదు.
అలాంటి చంద్రబాబు కి తన చిరకాల మిత్రుడైన వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి నుండి ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా చక్రం తిప్పిన చంద్రబాబు గారికి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు.
ఇప్పుడు గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఏర్పాటుచేసిన అమరావతి రాజధాని ని విశాఖకు తరలిస్తున్నారు. ఈ విషయంపై స్పందిస్తూ ఈ రోజు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి 48గంటల సమయం ఇచ్చి తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు.
ఒకప్పుడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రతిసారి ప్రభుత్వాలపై రాజీనామాలు అస్త్రం సంధించి ప్రజాతీర్పు కోసం తెగువతో ముందడుగు వేసేవారు. అలా తెలంగాణ కల సాకారం చేసిన వ్యక్తిగా నిలిచిపోయారు. ఇప్పుడు అమరావతి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తోందా లేదా అనేది ఆసక్తికర అంశంగా మారింది.
బాబు గారు ఈ వయసులో అలాంటి తెగింపు కలిగిన నిర్ణయం తీసుకుని అమరావతి కల సాకారం చేసుకోవడానికి ప్రజా తీర్పు కోసం రాజీనామాలు చేసి ముందుకు వెళతారా లేక పసలేని ప్రకటనలు చేసే వ్యక్తిగా మిగిలిపోతారా అనేది చూడాలి.