పూరి జగన్నాధ్, మనసులో ఉన్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం అతడి స్టైల్. తను సృష్టించిన కథలు, కథానాయకులు కూడా చాలా రఫ్ గా కనిపిస్తాయి అచ్చం అతడి మాటలు లాగా. సమాజాన్ని అతను చూసే దృష్టికోణం వేరు. కరోనా వలన వచ్చిన ఈ ఖాళీ సమయంలో podcast యాప్ ద్వారా ఆయన తన భావాలను అందరితో పంచుకుంటున్నారు. అలా ఇటీవల స్త్రీ అనే ఒక సందేశం చెప్పారు. దానిని యథాతథంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం.
“స్త్రీని మనం ఎప్పుడూ పుస్తకాల్లోనే గౌరవించాం. నిజ జీవితంలో కాదు. మాతృస్వామ్య వ్యవస్థ పోయి, ఎప్పుడైతే సమాజం మగాళ్ల చేతికొచ్చిందో అప్పటినుంచి ఆడాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. అవసరం కోసమే ఆడది. సెక్స్ కోసం, వంట కోసం. పూర్వం ఒక అమ్మాయిని తెస్తే, ఆ ఇంట్లో ఎంత మంది మగాళ్లు ఉంటే అంత మందికి ఆ అమ్మాయి భార్యే.. ఆ ఇంట్లో అన్నదమ్ములు అందరితోనూ కాపురం చేయాలి. ఆమెనే ఇల్లాలు అనేవారు. ఇల్లాలు అంటే ఆ ఇంటి అందరికీ ఆలు అని అర్థం. ఆ తర్వాత వెయ్యి సంవత్సరాల క్రితం బాల్యవివాహాలు మొదలయ్యాయి.
డబ్బు లేకపోవడం వలన ఇన్ సెక్యూరిటీ భావన వలన తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేసేసేవారు. ఎంతో కొంత కన్యాశుల్కం వస్తుందని. దీని తర్వాత వరకట్నం. అది ఇప్పటికీ పోవట్లా. దాని తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని దారుణం సతీసహగమనం. భర్త చనిపోతే అదే శవం మీద బతికున్న భార్యను తగలబెట్టడం. ఒకరోజు కాదు, వంద రోజులు కాదు. కొన్ని వందల ఏళ్లు ఆడాళ్లను తగలబెట్టాం. సజీవదహనం చేశాం. లాస్ట్ సజీవ దహనం ఎప్పుడు జరిగిందో తెలుసా? నిన్నగాక మొన్న 1987లో మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల అమ్మాయిని, 2002లో 65 ఏళ్ల మహిళను సజీవ దహనం చేశారు. ఏ మాటకామాట మనం శాడిస్ట్ నా కొడుకులం.
ఆ తర్వాత ఆడవాళ్లను విధవను చేశాం. వితంతువును ఎన్ని కష్టాలు పెట్టామో మనందరికీ కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మో, నాన్నమ్మో ఉన్నారు. వాళ్ళను చూస్తూ పెరిగాం. తెల్ల చీర కట్టుకోవాలి, కుంకుమ తాకకూడదు. శుభకార్యం అయితే ఆ చుట్టుపక్కలకు రానివ్వరు. ఆవిడ ఎదురొస్తే అశుభమట. దాక్కోని దాక్కోని చచ్చారు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు.
ఆచారం ముసుగులో ఉన్న మూర్ఖులం మనం. మన గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకోకండి ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మనది. ఈ ఒక్క జనరేషన్ లోనే ఆడాళ్లు ధైర్యంగా తిరుగుతున్నారు. మాట్లాడుతున్నారు. ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుంటున్నారు. కానీ 60 వేల సంవత్సరాలు ఆడదానికి మనం నరకం చూపించాం. ఇప్పటికీ ప్రతి గంటకు ఒక రేప్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ గౌరవించం. ఏ దేశంలో అయితే స్త్రీకి గౌరవం లభిస్తుందో ఆ దేశాలే రూల్ చేస్తాయి. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ సంక నాకి పోయాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక నుండైనా మగాడి మీద ఆధారపడకుండా ఆడది ఎదగాలి. అసలు మగాడిని పూర్తిగా వదిలేయండి. మీకు తెలుసా? జమైకాలో పూర్తిగా పెళ్ళిళ్ళు లేవు. ఆడవాళ్లే రూల్స్ చేస్తారు మగవాళ్లను తెచ్చుకుంటారు నచ్చకపోతే బయటకు తోసేస్తారు. మళ్లీ ఇంకొకరని తెచ్చుకుంటారు. నా మాట విని మానేయండి పెళ్ళిళ్ళు. ఈ మగ నా కొడుకులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి..? అందగత్తెలకు కాదు ర్యాంప్ వాక్లు. మగాళ్ల తోడు లేకుండా తన కాళ్ల మీద నిలబడ్డ ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంప్ వాక్లు.
సక్సెస్ ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ని గౌరవించాలి, సన్మానాలు చేయాలి. వాళ్లే మన మిస్ ఇండియాలు.“
పూరీ జగన్నాధ్ @podcast