ఇటీవల ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో విడుదలైన అదిరింది కామెడీ షో ప్రోమో వివాదం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ ఒక నటుడు చేసిన అభినయం పై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.
తమ నాయకుడిని అవమానించారని వైసీపీ కార్యకర్తలు జీ తెలుగు యాజమాన్యం పై దండయాత్ర చేసాయి. దిద్దుబాటు చర్యలు తీసుకున్న సంస్థ యాజమాన్యం ప్రోమోని తొలగించి కార్యక్రమం ప్రసారాన్ని నిలిపివేశారు. చివరిగా క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలికారు.
అయితే వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడలేదు. దీపికా కడారి అనే ఒక మహిళా ఎన్నారై సోషల్ మీడియాలో ఇచ్చిన లైవ్ లో మెగా కుటుంబం పై దుమ్మెత్తి పోసింది. ముఖ్యంగా నాగబాబు ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది. చిరంజీవి ప్రజారాజ్యం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ జనసేన వరకూ అన్నిటిపై తన లైవ్ లో వివరిస్తూ అసభ్య పదజాలంతో విరుచుకుపడటంతో మెగా అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఫేస్ బుక్ అకౌంట్లో వరసగా కామెంట్స్ దాడి చేస్తున్నారు. ముఖ్యంగా కాపు కులాన్ని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.వివిధ మాధ్యమాల్లో ఆమెపై విస్తృతంగా దాడి జరుగుతున్న క్రమంలో వైసీపీ నుంచి దీపికకు మద్దతు అనుకున్న స్థాయిలో రావడం లేదు.
దీపిక కాపు కులాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తో వైసీపీకి సంబంధం లేదని సోషల్ మీడియా విభాగం వారు తేల్చిచెప్పారు. ఆమె వ్యక్తిగత ప్రచారం కోసం పార్టీని ఉపయోగించుకుని కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదని హెచ్చరించినట్లు సమాచారం.
ఆమె కవ్వింపు చర్యలకు పాల్పడుతూ గతంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని దూషించినట్టు చెబుతున్నారు. జగన్ మంత్రివర్గంలో కీలకమైన స్థానంలో ఉన్న ఒక మహిళా మంత్రిని కూడా ఆమె టార్గెట్ చేసి పోస్టులు పెడితే ఆమెకు మంత్రిగారి అనుచరులు గట్టిగానే హెచ్చరించి వదిలారు.
పార్టీ నుంచి మద్దతు లభించకపోగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె తన వివాదాస్పద లైవ్ ని డిలీట్ చేశారు. కానీ ఆగ్రహం చల్లారని మెగా ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆమెపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.