Counting of Votes : తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది రేపు అనగా ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. తెలంగాణ మొత్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30 తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తారీకు ఆదివారం రోజున ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వికాస్ రాజు తెలిపారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశాము. మొత్తంగా 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుల్ ద్వారా జరుగుతాయని 500 పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్ లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
2018 ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టిందని ఆయన వెల్లడించారు. ఎనిమిది గంటలకు మొదలవబోతున్న ఓట్ల లెక్కింపు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కతో ప్రారంభమవుతుంది. ఆ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తామని ఆయన తెలిపారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో సంఖ్య పెరిగింది. మొత్తంగా 1,80,000 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంది. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు.
ఒకవేళ అరగంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తిగా కాకపోతే, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలో లెక్కింపులను సమాంతరంగా మొదలుపెడతారు. ఇదంతా కూడా కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలోనే జరుగుతుంది. కౌంటింగ్ విషయంలో వారి ఆమోదం తర్వాతే ఫలితాలను తెలుపుతారు. కౌంటింగ్ లో ఎలాంటి సమస్యలు, అభ్యంతరాలు తలెత్తకుండా ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకుడిని ఎలక్షన్ కమిషన్ నియమించింది.