Janasena Chief Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రైతు పరామర్శలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తూ, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మొదటగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం లోని కడియం దగ్గర ఉన్న ఆవలో పంటలు దెబ్బతిన్న రైతులను ఆయన కలుసుకున్నారు. పంటను పరిశీలించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూసిన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయం కోసం ఇప్పటివరకు చాలా అప్పులు చేశామని ఈ అకాల వర్షంతో పంట, తీవ్ర నష్టానికి గురైందని కనీసం పెట్టుబడి అయిన వస్తుందో ,రాదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని ,పంట నష్టపోయిన విధానాన్ని రైతులు వివరిస్తుంటే రైతుల బాధలు విని ఆయన తల్లిడిల్లిపోయారు.
ఇంకోవైపు కళ్లాల్లో ఎండబోసిన ధాన్యాన్ని, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం రైతులు పవన్ కళ్యాణ్ కి చూపించారు. ధాన్యాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ రైతులకు భరోసా ఇస్తూ ,ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయి తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా,
కనీసం రైతులకు గోనెసంచులను కూడా అందివ్వకుండా రైతులను ప్రభుత్వం ఇంకా ఇబ్బంది పెడుతుంది అనీ పవన్ కళ్యాణ్ వాపోయారు. నష్టపోయిన రైతుల పంట ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయవలసిన ప్రభుత్వాలు, ఆ రకమైన చర్యలు చేపట్టకపోగా, దాంట్లో విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, నష్టపోయిన పంట ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, నష్టపరిహారాన్ని చెల్లించాలని, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ,మరియు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్ తోపాటు, ఇతర నేతలు పాల్గోన్నారు.