Janasena Chief Pawan Kalyan : రైతులు పండించిన ధాన్యం కొనాలంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాలా ? మేము ఎంతో కష్టపడి ఈ పంట పండించాము. ఇంట్లో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి పంటకి పెట్టుబడి పెట్టాము. ఈరోజు ప్రభుత్వం మాత్రం మా ధాన్యాన్ని కొనడానికి ముందుకు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా దగ్గరికి వచ్చి మా గోడు వింటున్నారు. ఆయన కూడా ఎన్ని ఊర్లనీ తిరుగుతారు.
ఈరోజు ఆయన వస్తున్నారంటేనే మా ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ నియోజక వర్గం కడియం ఆవ ప్రాంతం రైతులు పవన్ కళ్యాణ్ కి తమ బాధను వెల్లబుచుకున్నారు. పవన్ కళ్యాణ్ ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మేమంతా కష్టాల్లో ఉన్నా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని పలకరించలేదని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు మాకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని రైతులు వాపోయారు. ఈసారి పంట సాగుకు 30 వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి అయింది. కానీ ఈ వర్షాలతో ఎకరాకి 20 బస్తాల పైనే నష్టపోయాము. ధాన్యం నల్లపాయ వచ్చేసింది.
మాకు వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. మద్దతు ధర 1500 ఉంటే, కొనుగోలు చేస్తూ తరుగు పేరిట అని చెప్పి బస్తాకీ 200 కోత పెడుతున్నారు. బస్తాకి 1200 నుంచి 1300 మాత్రమే వస్తుంది. తడిసిన ధాన్యాన్ని అసలు కొనే నాధుడే లేడు. వాస్తవానికి మొదట 33 బస్తాలే కొనడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం, మేము ధర్నా చేసిన తర్వాత ఇప్పుడు ఆ సంఖ్యను కాస్త పెంచారు.
ముఖ్యమంత్రి గారు పైకి మాత్రం 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అంటూ ప్రకటించారు. కానీ ఆ నిధి ఏమైందో ఎవరికీ తెలియదు. అని రైతులు తమ బాధను వెల్లడించారు. వాస్తవానికి ఆవ ఖరీఫ్ మొత్తం నీళ్లలోనే మునిగి ఉంటుంది. రభీ ఒక్కటే మాకు మిగిలేది. దానికి కావాల్సిన మరమ్మత్తులు, కాలువ పూడికలు అన్ని మేమే చేసుకుంటాం. ప్రభుత్వాలు ఏవి పట్టించుకోవు. ఇప్పుడు అకాల వర్షానికి ఈ పంట కూడా పోయిందని రైతులు కన్నీరు, మున్నీరు అయ్యారు.
రైతులు చెబుతున్న కష్టాలు అన్నింటినీ పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా విన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శ్రీ కందుల దుర్గేష్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.