Janasena Pithapuram : పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల ప్రచారం మొదలు.. వైసీపీ పన్నాగాలపై పవన్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పార్టీ ముఖ్య నేతలతో మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా జనసేనాని కీలక ప్రకటన చేశారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం మొదలు కాబోతోంది అని ప్రకటించారు.
దీని కోసం పార్టీ నేతలు, కన్వీనట్లు తగిన ఏర్పాట్లు చేయాలని జనసేనాని ఆదేశించారు. పిఠాపురం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి. అదే విధంగా శక్తి పీఠం.. కాబట్టి ఎన్నికల ప్రచారం, వారాహి యాత్ర అక్కడి నుంచి మొదలు పెడితేనే శుభప్రదం అని పవన్ కళ్యాణ్, జనసేన నాయకులూ భావిస్తున్నారు.
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించే జనసేనాని మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. పిఠాపురం ముఖ్య నాయకులు , మండల నాయకులతో పవన్ సమావేశాలు నిర్వహిస్తారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు నిర్వహిస్తారు.
పిఠాపురం నుంచే శ్రీ @PawanKalyan గారి ప్రచారానికి శ్రీకారం
పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి రాకపోకలు#PawanKalyanForPithapuram#VoteForGlass pic.twitter.com/tkt9KW8QOB
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2024
దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ వర్గాలని ఆదేశించారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో వైసిపి అనేక పన్నాగాలు పన్నుతోంది. కాబట్టి నేతలంతా ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. వైసిపి ఎన్ని కుట్రలు చేసిన జనసేన పార్టీదే విజయం అని పవన్ స్పష్టం చేశారు. పిఠాపురం నుంచే జనసేన పార్టీ శంఖారావం పూరిస్తుంది. విజయ నాదం రాష్ట్రం నలువైపులా వినిపిస్తుంది అని అన్నారు.